ఆ యువకుడు అలా ఎన్నిసార్లు కుళ్ళిపోయాడో, చిన్నతనాన్నుంచీ అనంతమయిన ఆవేదనలతోనే అతని జీవితము ప్రవహించి వచ్చింది. వాళ్ళ ఊరి పురోహితుడుగారు ''చదవడం మంచిదేరా ఎల్లమందా! కానీ నీ కులం సంగతి మరిచిపోకు'' అన్నారు.
ఆ పురోహితుడు సుబ్రహ్మణ్యం అవధానులుగారి దగ్గర వాళ్ళ తండ్రి పాలేరు. ఆ కుటుంబానికీ, ఈ కుటుంబానికీ ఎన్ని తరాల నుంచి సంబంధం ఉందో!
చంద్రయ్యమాదిగ కొడుకును చదువుకు పంపించాడు. చదువుకుందామని ఎల్లమందకి బుద్ధి కలగనేలేదు. చంద్రయ్యకు కొడుకుకు చదువు చెప్పించాలని ఉద్దేశం మొదటలేదు.
చంద్రయ్య సాధారణ మాదిగకులం మనుష్యుడే అయినా అవధానులుగారి వేదాంత వాక్యాలు ఎప్పుడూ వింటూ ఉండేవాడు. ఉత్తమ వాక్యాలు వినగా వినగా రాయికన్నా సంస్కారం కలుగుతుంది. అవధానులుగారు అసలు వేదాంతం చంద్రిగాడికి చెప్పాడా? ఆయనకు వేదాంతం మాటాడటం అలవాటు. అవి ఆచరణలో పెడదామన్న భావానికీ, వేదాంత వాక్యాలు అంటూ ఉండడానికీ సంబంధం ఏమిటి? అవసరం వచ్చినప్పుడు ఏవో ముక్కలు అంటాం. అంతే వాని ఉపయోగం.........