ALL CATEGORIES

అడివి బాపిరాజు కవి, చిత్రకారుడు, శిల్పి, కథకుడు, నవలారచయిత, గాయకుడు, పత్రికా సంపాదకుడు, కళాదర్శకుడు, జాతీయోద్యమ యోధుడు, ఆచార్యుడు. వీటన్నిటికీ మించి గొప్ప సహృదయుడు, మిత్రుల పెళ్లిళ్లలో మంగళహారతులు పాడినవాడు. కాల్పనికోద్యమకాలంలో బాపిరాజు ఇటు తెలుగు కవిత్వాన్నీ, సృజనాత్మక వచన రచనలనూ కొత్త పుంతలు తొక్కించాడు, అటు ఆంధ్రజాతి ప్రాచీన వైభవాన్ని మహోజ్వలంగా దీపింపజేసి జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించాడు. ఆంధ్రత్వం మూర్తీభవించిన బాపిరాజు చారిత్రకనవలా రచనలో తనదంటూ ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నాడు.

బాపిరాజు నవలల్లో హిమబిందు, గోన గన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, అంశుమతి చారిత్రక నవలలు. నారాయణరావు, తుపాను, కోనంగి, నరుడు, జాజిమల్లి సాంఘిక నవలలు. వీటిలో 'నారాయణరావు' నవల విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు'తో పోటీపడి ఆంధ్రవిశ్వకళా పరిషత్తు బహుమతిని గెలుచుకుంది.