ప్రథమ గాథ పీటల మీద పెండ్లి
పెళ్ళివారంతా యథోచిత స్థానాలపై మహాఠీవిగా కూర్చున్నారు. శ్రీ కుమార సింహగణార్ణవ కుమార అరిభీకరసూర్య గోన వరదారెడ్డి సాహిణి కుమారుడు వరుడై, సమస్తాభరణాలు ధరించినవాడై, జరీపూవులూ ముత్యాలకూర్పులూ కుట్టిన ¬ంబట్టు ఉపధానాలమధ్య చెక్కిన పాలరాతి విగ్రహంలా వివాహవేదికపై కూర్చుండి ఉన్నాడు. వజ్రాలు కూర్చిన బంగారు పిడితో నడుమున వ్రేలాడు బాకుపై ఎడమచేయి తీర్చియున్నది. కుడిచేయి దిండుపై అలంకరించి యున్నది.
వర్ధమానపుర రాజ్యపు మంత్రిముఖ్యులూ, సేనానాయకులూ, రాజ బంధువులూ, సామంతప్రభువులూ మొదలైనవారంతా చుట్టూ పరివేష్టించి యున్నారు.
ఆదవోని రాజ్య పరిపాలకుడు ప్రతాపాదిత్య, ప్రచండవిక్రమ, పరగండ భైరవ, అశ్వసాహిణి శ్రీకోటారెడ్డి దేవర మహామండలేశ్వరుడు శ్రీ విశాలాక్షి దేవీపూజానిరతురాలగు తన కుమార్తె అన్నమదేవిని, వర్ధమాన మండలేశ్వరుల కుమారునికి వివాహముచేస్తూ ఉన్నారు. ఈ రెండు రాజ్యాలనూ ఏకం చేసే ఈ శుభలగ్నానికి అప్పుడే త్రైలింగ మహాసామ్రాజ్యానికి సార్వభౌములైన శ్రీశ్రీ రుద్రదేవచక్రవర్తియు, మహామంత్రులైన శ్రీ శివదేవయ్య దేశికులును, సర్వసైన్యాధ్యక్షులైన శ్రీ జన్నిగదేవ మహారాజులుంగారును బహుమతులు, ఆశీర్వాదాలు సేనాధికారుల ద్వారా పంపించియున్నారు......